దేశంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నా... కొందరు మాత్రం మూఢనమ్మకాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. అనుమానం కొందరి పాలిట యమపాశంగా మారుతుంది. తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి... మూఢ నమ్మకానికి బలైపోయారు. చేతబడి అనుమానంతో సజీవ దహనం చేసిన దారుణ ఘటన మల్యాల మండలం బల్వాంతపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.
హైదరాబాద్కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి పవన్.. ఇటీవల మృతి చెందిన తన బావమరిది జగన్ కుటుంబాన్ని పరార్శించేందుకు బల్వాంతపూర్ వెళ్లాడు. అయితే పవనే తన భర్తను మంత్రగాళ్ల సాయంతో చంపించి ఉంటాడని ముందు నుంచి అనుమానిస్తున్న జగన్ భార్య సుమలత.. పవన్ తన ఇంటికి రాగానే సజీవ దహనం చేసింది. మరో వ్యక్తి సహాయంతో మంజునాథ స్వామి ఆలయం గదిలో బంధించి పెట్రోల్ పోసి, తగులబెట్టేసింది. ఈ ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. జగన్ భార్య సుమలత... ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా ఈ జగన్, పవన్ కుటుంబాల మధ్య గొడవలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.