Rajasthan : రాజస్థాన్లో దారుణం జరిగింది. పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారు. మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టారు. ఓ ప్రయివేటు ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళా పేషెంట్పై అత్యాచారం జరిగిన సంఘటన రాజస్థాన్లోని ఆల్వార్లో చోటుచేసుకుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న 24 ఏళ్ల మహిళ ఆ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది.
మంగళవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో ఐసీయూలో నర్సింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న చిరాగ్ యాదవ్ ఆమెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. అతడ్ని చూసి భయపడ్డ ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించగా మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చాడు. దాంతో స్పృహ కోల్పోయిన ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు శివాజీ పార్క్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజ్పాల్ సింగ్ చెప్పారు.