Tirupati : రేణిగుంటలో తీవ్ర విశాదం.. అగ్ని ప్రమాదంలో వైద్యుడి కుటుంబం దుర్మరణం..
Tirupati : తిరుపతి జిల్లా రేణిగుంటలోని కార్తికేయ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు;
Tirupati : తిరుపతి జిల్లా రేణిగుంటలోని కార్తికేయ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మరణించారు. అగ్నిప్రమాదం ఓ వైద్యుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆస్పత్రి పైపోర్షన్లో ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడితో పాటు ఆయన కుమార్తె, కుమారులు మృతి చెందారు. డాక్టర్ రవిశంకర్ రెడ్డి... ఘటనాస్థలంలోనే సజీవదహనం కాగా.. ఆయన పిల్లలిద్దరూ చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో ఆప్రాంతంలో విషాదం నెలకొంది. ఆస్పత్రిలో చిక్కుకున్న మరికొందరిని... రెస్క్యూ టీం కాపాడింది.
రేణిగుంట పట్టణం భగత్సింగ్ కాలనీలో డాక్టర్ రవిశంకర్రెడ్డి కార్తికేయ పేరుతో ఆస్పత్రి నడుపుతున్నారు. ఆయన కుటుంబం ఆస్పత్రి నిర్వహిస్తున్న భవనంలోనే పైఅంతస్తులో వుంటోంది. ఉదయం వైద్యుడి కుటుంబం నివాసముంటున్న అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న తిరుపతి ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు గమనించి వెంటనే రవిశంకర్రెడ్డి భార్య, అత్తను కాపాడారు. అగ్నిమాపక సిబ్బంది అతికష్టం వైద్యుడి కుమారుడు భరత్ కుమార్తె కార్తీకను పైఅంతస్తు నుంచి కిందికి దించారు.
అయితే ఆ పిల్లలిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారులు కూడా మృతిచెందారు. షార్ట్సర్క్యూట్తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
రోగులు ఎవరూ ఆస్పత్రిలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జమ్మలమడుగుకు చెందిన రవిశంకర్ రెడ్డి దంపతులిద్దరూ వృత్తి రీత్యా వైద్యులు కావడంతో రేణిగుంటలో వైద్యశాలను నిర్మించుకుని కింది భాగంలో క్లినిక్ నిర్వహిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఫర్నీచర్ అధికంగా ఉండడంతో మంటలు ఉవ్వెత్తున వచ్చాయని పోలీసులు తెలిపారు.