తాను ఏపీ టీడీపీ ఎంపీ కుమారుడినంటూ పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని KPHB పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన విక్రాంత్ రెడ్డి ఇటీవల జేఎన్టీయూలోని సితారా ఉమెన్స్ హాస్టల్లో తన జూనియర్స్ ను జాయిన్ చేస్తానని హాస్టల్ నిర్వాహకురాలిని పరిచయం చేసుకున్నాడు. నాలుగు సార్లు హాస్టల్ కు వెళ్లి అక్కడి ఫుడ్ కూడా టేస్ట్ చేసాడు. తనకి జ్యువల్లరీ షోరూం ఉందని, మీరు ధరించిన బంగారు గొలుసు ఇస్తే మరింత అందంగా డిజైన్ చేసి ఇస్తాన ని హాస్టల్ నిర్వాహకురాలిని నమ్మించాడు. విక్రాంత్ మాటలు నమ్మిన సదరు మహిళ తన మేడలో ఉన్న నాలుగు తులాల గొలుసును అతడికి ఇచ్చింది. మంచి డిజైన్ కావాలంటే మరింత బంగారాన్ని కలపాలని, అందుకు రూ.లక్ష వరకు అవుతుందని చెప్పాడు. అది నమ్మిన మహిళ ఫోన్ పే ద్వారా రూ.55వేలు, 45వేల నగదు ఇచ్చింది. బంగారు చైన్ కోసం తిరిగి విక్రాంత్ కు ఫోన్ చేస్తే ఆ నంబర్ పని చేయడం లేదనే సమాధానం వచ్చింది. దాంతో తాను మోసపోయినట్ల గ్రహించిన ఆమె KPHB పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా విక్రాంత్ రెడ్డి అపోలో ఆస్పత్రి లో న్యూరో సర్జన్ గా పని చేస్తున్నట్లు తేలింది. అతడిపై గతంలో ఏపీ, తెలంగాణలో 9 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విక్రాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.