భార్య బంధవులు తన కుటుంబసభ్యులపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని మహిళ భర్త అరవింద్ హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పరకాల మండలం పోచారంకు చెందిన అబ్బోజ్ అరవింద్ భూపాలపల్లి జిల్లా బుద్దారంకు చెందిన మాల స్వప్న గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేయగా ఒప్పుకోకపోవడంతో జనవరి 26న కొత్తగట్టు ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అరవింద్ వాళ్ల అమ్మమ్మతో కలిసి రెడ్డికాలనీలో కాపురం పెట్టారు. ఈ క్రమంలోనే స్వప్న కుటుంబసభ్యులు అరవింద్ను బెదిరింపులకు పాల్పడుతూ వస్తున్నారు. సోమవారం సాయంత్రం రెడ్డికాలనీలోని అరవింద్ ఉంటున్న ఇంటిపై స్వప్ప కుటుంబసభ్యులు దాడి చేసి స్వప్నను బలవంతంగా లాక్కెళ్లి ఫోన్ స్విచ్ఛాప్ చేశారు. దీంతో తనతో పాటు తన భార్యపై దాడిచేసి భార్యను కిడ్నాప్ చేశారని అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.