తెలంగాణలో నిర్భయ తరహాలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేయడం కలకలం రేపింది. ట్రావెల్స్ బస్సులో డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు డ్రైవర్లు మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బస్సు కదులుతూ ఉండగానే.. బాధిత మహిళ డయల్100కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓయూ పోలీస్ స్టేషన్ వద్ద బస్సును ఆపి సీజ్ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్(ప్రధాన నిందితుడి) కోసం గాలిస్తున్నట్లు సీఐ రాజేందర్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.