తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రులు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో దుర్గామాత ఆలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా భారీ ఏర్పాట్లు చేశారు. తొలిరోజు స్వర్ణకవచాలంకృతగా దుర్గమ్మను అలంకరించారు. దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దుర్గమ్మవారు 9 రోజుల్లో 10 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అటు.. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర సరస్వతి శరన్నవరాత్రి వేడుకలకు ముస్తాబైంది. మొదటి రోజు సరస్వతి అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు అధికారులు. అక్షరాభ్యాస పూజలు నిర్వహించే భక్తులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. నాందెడ్కు చెందిన జగదీష్ మహారాజ్ గాడిపురా భక్తులకు 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.