రెజ్లర్లపై ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల అంశం కోర్టుకు చేరింది. ఎంపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన రెజ్లర్లు నిరసన కార్యక్రమాలు ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.
దీనిపై ఎంపీ బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తానేమీ వ్యాఖ్యానించబోనని పేర్కొన్నారు. కోర్టు తన పని తాను చేసుకుపోతోందని వ్యాఖ్యానించారు.
నిరసన ఉపసంహరణ విషయాన్ని స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియా వెల్లడించారు. ప్రభుత్వం చెప్పినట్లుగా బ్రిజ్ భూషణ్పై ఛార్జిషీట్ నమోదు చేసినందున, మా పోరాటం ఇక న్యాయస్థానంలో జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగా జులై 11న రెజ్లింగ్ ఫెడరేషన్కు ఎన్నికలు జరగాలని ఆశించారు.
"జూన్ 7న జరిపిన చర్చల్లో భాగంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుపరిచింది. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై విచారణ జరిపి, ఎంపీ బ్రిజ్ భూషణ్పై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇకపై మా పోరాటం రోడ్ల మీద కాదు, న్యాయస్థానంలో " అని వెల్లడించారు.
జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన రెజ్లర్లు, ఎంపీ బ్రిజ్ భూషణ్పై ఛార్జ్షీట్ దాఖలయ్యేలా చూస్తామని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాగూర్ హామీతో నిరసనను ఆపేశారు.
జులై 6న జరగాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలు జరగాల్సిన ఎన్నికలు జులై 11కు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికల ద్వారా అధ్యక్షుడు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, నాలుగు వైస్ ప్రెసిండెంట్, సెక్రటరీ జనరల్, ట్రెజరర్, రెండు జాయింట్ సెక్రటరీ, మరో ఐదు కార్యనిర్వాహన సభ్యులు ఎన్నిక కానున్నారు.
పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ ప్రాంతాల నుంచి 2 నామినేషన్లను పంపవచ్చు. నామినేషన్ల పరిశీలన జులై 4న నిర్వహించనున్నారు. నామినేషన్ పత్రాల ఉపసంహరణకు తుది గడువు జులై 7 సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. పోటీలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితా జులై 8న ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
జులై 11న ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించనున్నారు.