ప్రధాన మంత్రి పక్కా ఇల్లు పథకానికి మీరు అర్హులో కాదో ఒకసారి..
పట్టణంలో నివసించే పేదలకు, ఇంటి నిర్మాణం, గదుల విస్తరణ వంటి పనులకు గృహ రుణాలను వడ్డీ రాయితీతో అందిస్తున్నారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎమ్ఏవై) కింద గృహాన్ని పొందేందుకు అర్హత కలిగి ఉండి, భారత దేశంలో ఎక్కడా పక్కా ఇల్లు లేని వారు ఈ పథకం కింద రుణం పొందొచ్చు. రుణం పొందిన వారికి వడ్డీలో రాయితీ లభిస్తుంది.
రూ.3 లక్షలలోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న ఆర్థిక బలహీన వర్గాల వారు,
రూ.3 నుంచి రూ.6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల వారు,
రూ.6 నుంచి రూ.12 లక్షల వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి గ్రూప్-I కుటుంబాల వారు,
రూ.12 నుంచి రూ.18 లక్షలు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి గ్రూప్-II కుటుంబాల వారు అర్హులు.
క్రెడిట్ లింకెడ్ సబ్సిడీ స్కీమ్ కింద అన్ని వర్గాల వారికి రాయితీ లభిస్తుంది. పట్టణంలో నివసించే పేదలకు, ఇంటి నిర్మాణం, గదుల విస్తరణ వంటి పనులకు గృహ రుణాలను వడ్డీ రాయితీతో అందిస్తున్నారు. ఈ రాయితీని లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా క్రెడిట్ చేస్తారు.
సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ-2011)లను అనుసరించి, గ్రామ సభలు ధృవీకరించిన వారిని పీఎమ్ఏవై కింద లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారు. నిరాశ్రయులు, పక్కా గృహాలు లేని కుటుంబాల వారికి ప్రాధాన్యత ఇస్తారు. పురుషుడు లేకుండా స్త్రీ కుటుంబ పెద్దగా ఉన్నప్పుడు, దివ్యాంగుడైన వ్యక్తి, రోజు వారి ఆదాయంతో జీవించే భూమిలేని కార్మికులు ఈ జాబితాలోకి వస్తారు.
అర్హత కలిగిన రుణ గ్రహీతలకు రాయితీ మొత్తం బ్యాంకు చెల్లిస్తుంది. వడ్డీ రాయితీని బ్యాంకు స్వీకరించిన తరువాత, అది లబ్దిదారుని రుణ ఖాతాకు జమ చేస్తారు. రాయితీ నికర విలువ ప్రస్తుతం 9 శాతంగా లెక్కిస్తున్నారు. ఉదాహరణకు రుణ గ్రహీతకు రూ.8 లక్షల రుణం లభిస్తే రూ.2.20 లక్షలకు రాయితీ వర్తిస్తుంది. ఆ మొత్తాన్ని రుణం నుండి ముందస్తుగా తగ్గించవచ్చు. రుణ గ్రహీత రూ.5.80 లక్షలకు మాత్రమే ఈఎమ్ఐ చెల్లించవలసి ఉంటుంది.