దేశంలో మళ్లీ కరోనా పంజా.. అత్యధిక కేసులు అక్కడే..
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య కోటి 18లక్షల 46వేల 652కు చేరుకుంది.;
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య కోటి 18లక్షల 46వేల 652కు చేరుకుంది. మరణాల సంఖ్య లక్షా 60వేల 949కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు.. కరోనా నుంచి కోటి 12లక్షల 64వేల 637 మంది కోలుకున్నారు.
దీంతో మొత్తం రికవరీ రేటు 95.09 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షల 21వేల 66గా ఉంది. కొత్త కేసుల్లో ఎక్కువ శాతం కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు దేశంలో 5.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది.
మహారాష్ట్రలో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించారు. ఆదివారం రాత్రి నుంచి ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. అన్ని షాపింగ్ మాల్స్ రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్టైంది. బెంగళూరు రావాలంటే కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశారు. నగరంలో మహిళల కంటే పురుషులకే అధికంగా కరోనా వైరస్ సోకుతుందని వైద్యాధికారులు వెల్లడించారు.
కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. హోలీ, ఈస్టర్, ఈద్–ఉల్–ఫితర్ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు.
కరోనాను ఎదుర్కోవడంలో దేశం ప్రస్తుతం కీలక దశలోకి చేరుకుందని.. ఈ దశలో అలసత్వం ప్రదర్శించడం మంచిదికాదన్నారు.