Bangalore Omicron : కర్ణాటకలో ఒమిక్రాన్ కలకలం.. సినీ ఫక్కీలో తప్పించుకున్న పేషెంట్
Bangalore Omicron : ఈ కొత్త వేరియంట్ సోకిన 66 ఏళ్ల దక్షిణాఫ్రికా వాసి కొన్ని రోజుల పాటు బెంగళూరులోని ఓ హోటల్లో ఐసోలేషన్లో ఉండి ఆ తర్వాత తప్పించుకుపోయిన అంశంపై విచారణకు ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం.
Bangalore Omicron : ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ మన దేశంలోనూ కలకలం రేపుతోంది. ఈ కొత్త వేరియంట్ సోకిన 66 ఏళ్ల దక్షిణాఫ్రికా వాసి కొన్ని రోజుల పాటు బెంగళూరులోని ఓ హోటల్లో ఐసోలేషన్లో ఉండి ఆ తర్వాత తప్పించుకుపోయిన అంశంపై విచారణకు ఆదేశించింది కర్ణాటక ప్రభుత్వం. ఆ రోగి ఓ ప్రైవేటు ల్యాబ్లో నెగెటివ్ సర్టిఫికెట్ పొందడంపైనా సందేహాల్ని వ్యక్తం చేసింది.
అతడికి పాజిటివ్గా తేలిన మూడ్రోజుల్లో నెగిటివ్ ఎలా వచ్చింది? అలాగే, ఓ కంపెనీ బోర్డు సమావేశంలో పాల్గొనడం.. జీనోమిక్ సీక్వెన్సింగ్ కోసం పంపిన శాంపిల్స్ నివేదికలు ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ దేశం విడిచి వెళ్లిపోవడం తదితర అంశాలపై దర్యాప్తు చేయనున్నట్టు పేర్కొంది. అతడు వెళ్లిన ప్రైవేటు ల్యాబ్లో ఏమైనా అవకతవకలు జరిగాయా? అక్కడ పరీక్షలు పక్కాగా జరిగాయా? లేదా..? ఏదైనా తప్పు జరిగిందా..? తదితర కోణాల్లో విచారించాలని పోలీస్ కమిషనర్ని ఆదేశించినట్టు కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి ఆర్.అశోక తెలిపారు.
మరోవైపు..... బెంగళూరులో 10 మంది దక్షిణాఫ్రికా జాతీయులు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. వీరంతా బెంగళూరుకు నవంబరు 12 నుంచి 22 నడుమ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. వీరు బెంగళూరులో దిగినప్పుడు.. అక్కడ తాము ఉండబోయే చిరునామాలను అధికారులకు ఇచ్చారు. ఒమైక్రాన్ కేసులు రెండు బయటపడటంతో వారికి మళ్లీ పరీక్షలు చేయడానికి ఆయా చిరునామాలకు వెళ్లగా.. వారు అక్కడ లేకపోవడం కలకలం రేపుతోంది. వారి మొబైల్ఫోన్లు సైతం స్విచాఫ్ చేశారు. దీంతో వారి ఆచూకీ కోసం కర్ణాటక ఆరోగ్యశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.