డీఎస్సీకి మొత్తం 2,79,956 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో లక్ష మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారంతో అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. వచ్చే నెల 17 నుంచి 31 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కింద మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ గత నెల 29న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 4 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డీఎస్సీ రాయాలంటే ముందుగా టెట్లో అర్హత సాధించాలి. పైగా టెట్లో సాధించిన మార్కుల్లో డీఎస్సీకి 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
దీంతో ఈ ఏడాదికి టెట్ నిర్వహించకపోవడంతో డీఎస్సీ 2024కి దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతామని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఆందోళన పడ్డారు. దీనిపై స్పందించిన సర్కార్ డీఎస్సీకి ముందే టెట్ నిర్వహణకు ప్రకటన వెలువరించింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు ఉన్నాయి.