టీడీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎవరిని వదిలిపెట్టనని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన్ను.. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు కలిశారు. తాడిపత్రిలో అధికార పార్టీ, పోలీసుల అధ్వర్యంలో జరుగుతున్న దౌర్జన్యాలను కౌన్సిలర్లు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరుని వివరించారు మహిళా కౌన్సిలర్లు.
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి వైసీపీ కండువా కప్పుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారంటూ లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. అక్కడ జరుగుతున్న అరాచకాలు అన్ని తనకు తెలుసన్నారు లోకేష్. ఎవరినీ వదిలిపెట్టనని.. కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ ధైర్యంగా పోరాడుతున్నారంటూ కౌన్సిలర్లను లోకేష్ అభినందించారు.