ఒకటే లక్ష్యం.. వైసీపీని ఓడించడం. ఒకటే వ్యూహం.. వైసీపీని నుంచి ఆంధ్రప్రదేశ్ను రక్షించడం. ఇదే టార్గెట్ పెట్టుకుని హస్తిన వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ అగ్రనేతలతో వరుస భేటీలు అయ్యారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ కీలక సమావేశం నిర్వహించారు. భేటీ తర్వాత మాట్లాడి న పవన్ కల్యాణ్.. ఏపీలో రాజకీయ పరిణామాలు, అధికార పార్టీ సృష్టిస్తున్న ఘర్షణ వాతావరణం, అవినీతిపై చర్చించినట్లు చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తన అభిమతమన్న పవన్.. బీజేపీ నాయకత్వం కూడా ఇదే ఆలోచిస్తోందని చెప్పారు.
ఏపీకి సంబంధించి ఒక స్థిరత్వం ఉండాలని తాను మొదటి నుంచి కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ జనసేన, బీజేపీ ఎజెండా అని కుం డబద్దులు కొట్టారు. పొత్తులపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయానికి రాలేదన్న ఆయన.. మొదట తమ పార్టీని బలోపేతం చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ బలోపేతానికి వారు సంస్థాగతంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. కచ్చితంగా అధికారం సాధించే దిశగానే అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. అది ఎలా అన్న దానిపై అన్ని కోణాల్లో చర్చిస్తున్నా మన్నారు పవన్ కళ్యాణ్.