నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని దేశవ్యాప్త నిరసన!
నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలు విద్యార్థి సంఘాలు గురువారం దేశవ్యాప్త నిరసనకు దిగనున్నాయి.
ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకోసం నిర్వహించే జాతీయ పరీక్షలు జేఈఈ, నీట్ నిర్వహణపై వివాదం తలెత్తింది. కరోనా నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్తోపాటు పలు ప్రతిపక్ష పార్టీల సీఎంలు డిమాండ్ చేశారు. పరీక్షల వాయిదాకోసం కేంద్రంపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించారు. ఇక నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పలు విద్యార్థి సంఘాలు గురువారం దేశవ్యాప్త నిరసనకు దిగనున్నాయి. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు గురువారం దేశవ్యాప్తంగా తమతమ ఇళ్లలోనే నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని పిలుపునిచ్చాయి. నల్ల బ్యాడ్జీలు, నల్ల మాస్కులు ధరించాలని, సోషల్మీడియాలో నలుపు ప్రొఫైల్ చిత్రాలు పెట్టుకోవాలని పేర్కొన్నాయి.
మరోవైపు నిర్ణయించిన సమయానికే పరీక్షలు నిర్వహించి తీరుతామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం స్పష్టం చేసింది.