యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. కన్నౌజ్ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కన్నౌజ్ నియోజకవర్గం నుంచి ఎస్పీ తరపున తొలుత తేజ్ప్రతాప్ యాదవ్ బరిలో ఉంటారని ప్రకటించారు. అయితే తేజ్ప్రతాప్ అభ్యర్థిత్వాన్ని పార్టీ శ్రేణులు ఒప్పుకోకపోవడంతో అఖిలేశ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.
2019 వరకు సమాజ్వాదీ పార్టీకి కన్నౌజ్ కంచుకోటగా ఉండేది. గత ఎన్నికల్లో బీజేపీ నేత సుబ్రాత్ పాఠక్ అక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో అఖిలేశ్ ఆజాంఘడ్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో కర్హల్ నుంచి గెలుపొందారు. గతంలో కన్నౌజ్ స్థానం నుంచి డింపుల్ యాదవ్, ములాయం సింగ్ గెలుపొందారు.
యూపీలో ఇండియా కూటమికి మంచి భవిష్యత్తు ఉందని, ఈ ఎన్నికల్లో బీజేపీ చరిత్రలో కలిసిపోతుందని ఇటీవల అఖిలేష్ యాదవ్ అన్నారు. కన్నౌజ్ నుంచి తేజ్ ప్రతాప్ పేరు ప్రకటించడంపై ఆ పార్టీ కార్యకర్తలు ఆశ్యర్యం వ్యక్తం చేయడంతో పాటు కొంత అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఒకవేళ అఖిలేష్ ఇక్కడ నుంచి పోటీ చేయకుంటే బీజేపీదే మొగ్గు ఎక్కువగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు.