వచ్చే ఐదు రోజులు దేశ మంతటా వడగాలుల ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో (పశ్చిమబెంగాల్, కర్ణాటక, ఒడిసా, ఉత్తరప్రదేశ్, బిహార్) వడగాలులు తీవ్రం కానున్నాయని హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40–45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని పేర్కొంది. రానున్న ఐదు రోజులపాటు వడగాలులు కొనసాగుతాయని, రాత్రి వేళ కూడా వేడి వాతావరణ నెలకొంటుందని హెచ్చరించింది.
పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని.. కర్ణాటక, ఒడిసా, ఉత్తరప్రదేశ్, బిహార్లో నిర్దిష్ట సమయాల్లో వడగాలుల వీస్తాయని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో వాయవ్య భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చేసుకుంటాయని, ఆ తర్వాత క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది.
ఈశాన్య అసోం, ఈశాన్య బంగ్లాదేశ్లో తుఫాను వాతావరణం నెలకొందని, ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కిం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కాగా, ఎండల దెబ్బ ఈ నెల 26న జరిగే రెండో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వడగాలులపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం జరిగే పోలింగ్లో ఓటింగ్ శాతం తగ్గుతుందని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.