AYODHYA: ముమ్మరంగా అయోధ్య రామాలయ నిర్మాణం
గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి... ఫొటోలను పోస్ట్ చేసిన రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్;
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం 2024 నాటికి భక్తులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్న నిర్వాహకులు అందుకు తగ్గట్టుగానే చకచకా నిర్మాణ పనులు చేస్తున్నారు. మూడు అంతస్తుల్లో రామ మందిరం రూపుదిద్దుకుంటుండగా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. కాగా మొదటి అంతస్తు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిరథమహారథుల కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారితో పాటు సాధారణ భక్తులకూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా దాదాపు 25 వేల మంది భక్తుల కోసం టెంట్ సిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అధిక సంఖ్యలో హాజరయ్యే భక్తులు అయోధ్య వాసుల ఇళ్లలో, హోటళ్లలో రుసుము చెల్లించే పెయింగ్ గెస్ట్గా బస చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు 2024 జనవరి 14 తేదీన మకర సంక్రాంతి రోజున ఆలయాన్ని ప్రారంభించనున్నట్లు రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ సందర్భంగా 10 రోజుల పాటు ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. ఈ మహత్తర కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. రామ మందిర ప్రారంభోత్సవం, ప్రతిష్ఠాపన కార్యక్రమాలను దేశ, విదేశాల్లో ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నృపేంద్ర మిశ్రా స్పష్టం చేశారు.
రామాలయ నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది అక్టోబరు నాటికి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. నాలుగు అంతస్తుల ఆలయం పూర్తయ్యాక గ్రౌండ్ ఫ్లోర్ను రామ్ కథ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేస్తామని వెల్లడించారు. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో గ్రౌండ్ ఫ్లోర్ నిర్మించి ఉంది. మొత్తం ఐదు మండపాలు ఉంటాయి. గర్భగుడిపై 161 అడుగుల టవర్గా ఉండే ఈ నిర్మాణం కోసం రాజస్థాన్కు చెందిన నాలుగు లక్షల క్యూబిక్ అడుగుల పాలరాయిని ఉపయోగించనున్నారు. ఇందులో ఎలాంటి స్టీల్ గానీ, ఇటుకలను ఉపయోగించ లేదు. రామాలయ నిర్మాణం నగారా శైలిలో ఉంటుందని.. దానికి 46 టేకు చెక్క తలుపులు ఉంటాయని నృపేంద్ర మిశ్రా తెలిపారు. గర్భగుడికి ఉండే ప్రధాన ద్వారం బంగారు పూతతో ఉంటుందని.. ఈ ఆలయ నిర్మాణం కనీసం వెయ్యి సంవత్సరాల పాటు నిలుస్తుందని వెల్లడించారు .