ఢిల్లీలో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపుతోంది. ఒకేసారి 5 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో స్కూళ్ల యాజమాన్యాలు, పోలీసులు అప్రమత్తం అయ్యారు. బుధవారం ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని 5 స్కూళ్లకు బెదిరింపు మెయిల్ వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన ఆయా స్కూళ్ల యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రక్షణ చర్యలను చేపట్టారు. పాఠశాలలను ఖాళీ చేయించి.. బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేయించారు. ఢిల్లీలోని ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్తో పాటు నోయిడాలోని పలు స్కూళ్లకు ఈ బెదిరింపు ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది.
బెదిరింపుల నేపథ్యంలో స్కూళ్లలో పరీక్షలను టీచర్లు మధ్యలోనే నిలిపివేశారు. ఫైర్ సేఫ్టీ టీమ్స్ చేసిన తనిఖీల్లో అనుమానాస్పద పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో.. ఆకతాయి పనిగా భావిస్తున్నారు. మెయిల్స్ పంపించిన వారి ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినట్టు చెబుతున్నారు.