Tamil Nadu: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ హత్య
పెరంబూర్లోని నివాసం దగ్గర నరికి చంపిన దుండగులు;
తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు కే ఆర్మ్స్ట్రాంగ్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. శుక్రవారం సెంబియమ్ ప్రాంతంలోని తన ఇంటి సమీపంలో పార్టీ నేతలతో మాట్లాడుతున్న ఆర్మ్స్ట్రాంగ్ను బైక్పై వచ్చిన ఆరుగురు వ్యక్తులు దాడి చేసి నరికారు. తీవ్రంగా గాయపడిన అతడిని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. అయితే ఆర్మ్స్ట్రాంగ్తో పాటు ఆయన వెంట ఉన్న మరో ఇద్దరిపై కూడా దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సెంబియం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా, గత ఏడాది జరిగిన గ్యాంగ్స్టర్ ఆర్కట్ సురేష్ హత్యకు ప్రతీకారంగానే ఇది జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్యను బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా ఖండించారు.