మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల రేవణ్ణ వెంటనే భారత్ రావాలని మాజీ ప్రధాని, తాత దేవెగౌడ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు Xలో ప్రకటన విడుదల చేశారు. పోలీసుల విచారణకు ప్రజ్వల్ సహకరించాలని కోరారు. ఈ కేసు విచారణలో తాను జోక్యం చేసుకోవడం లేదని దేవెగౌడ పేర్కొన్నారు. 60 ఏళ్లుగా ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వాస్తవాలు బయటకు రావాల్సి ఉందన్నారు.
పార్టీ అభిమానుల నుంచి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని, అయినా వాళ్లను వారించలేమని చెప్పారు. ప్రజ్వల్ వ్యవహారంలో నిజాలు తేలేవరకు తాను వేచి చూస్తానన్నారు. ప్రజ్వల్ చేసిన పనులు తనకు తెలియదంటూ ఎవరినీ బుజ్జగించే ప్రయత్నం కూడా చేయనన్నారు. ప్రజ్వల్ విదేశాలకు వెళ్తున్న సంగతి కూడా తనకు ముందుగా తెలియదన్నారు. ఈ వ్యవహారంలో నిజాలు ఆ దేవుడికే తెలుసునన్నారు.