IMD Alert: ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు..

రెడ్ అలర్ట్ జారీ;

Update: 2025-06-30 06:00 GMT

దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలతో అతలాకుతలం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక భారీ వర్షాలు కారణంగా ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న ఒక హోటల్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. ఏడుగురు ఆచూకీ గల్లంతైంది. ప్రమాద సమయంలో 29 మంది ఉండగా.. 20 మందిని అధికారులు రక్షించారు. ఇదిలా ఉంటే వరదలు కారణంగా చార్‌‌ధాయ్ యాత్రను 24 గంటల పాటు అధికారులు నిలిపివేశారు. రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, దేహ్రాదూన్, నైనీతాల్, తెహ్రీల్లో ఉన్న యాత్రికులను ముందుకు వెళ్లకుండా ఆపాలని స్థానిక యంత్రాంగానికి సమాచారమందించారు. సోమవారం వాతావరణ పరిస్థితులను సమీక్షించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఇక జార్ఖండ్‌లోని తూర్పు సింగ్బూమ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా వరద నీటిలో మునిగిన ఓ ఆశ్రమ పాఠశాల చిక్కుకున్న 162 మంది విద్యార్థులను స్థానికుల సాయంతో అధికారులు రక్షించారు. ఇక పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News