జమ్మూకశ్మీర్లో (Jammu and Kashmir) లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది. అనంతనాగ్-రాజౌరీ స్థానం నుంచి ఇద్దరు మాజీ సీఎంలు నేరుగా తలపడనున్నారు. గులాంనబీ ఆజాద్(డీపీఏపీ ), మెహబూబా ముఫ్తీ(పీడీపీ) తమ అభ్యర్థిత్వాలను ప్రకటించారు. అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కూడా బరిలో దిగనుంది. గుజ్జర్ నాయకుడు మిలాన్ అల్తాఫ్ అహ్మద్ ను ఈ సీటు నుంచి బరిలోకి దించింది. బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఈ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. ముఫ్తీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుండగా, ఆజాద్ వెనుక బీజేపీ ఉందని విపక్షాలు అంటున్నాయి.
ఆదివారం ముఫ్తీతో కలిసి పీడీపీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ సర్తాజ్ మద్నీ విలేకరుల సమావేశం నిర్వహించారు. కాశ్మీర్ లోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. శ్రీనగర్ నుంచి పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వహీద్ పర్రా, బారాముల్లా నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు మీర్ ఫయాజ్ పోటీ చేస్తారని తెలిపారు.
‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించే పోరాటంలో భాగంగా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నాము. పార్లమెంటులో జమ్మూకాశ్మీర్ ప్రజల గొంతుకను వినిపించడానికి కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే కాకుండా ఎన్ సీ కార్యకర్తలు కూడా నాకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని మొహబూబా ముఫ్తీ ఆరోపించారు.