Encounter : ఆస్పత్రి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్, పోలీసు మృతి
జమ్మూ కశ్మీర్లోని (Jammu Kashmir) కథువాలో ఏప్రిల్ 2న అర్థరాత్రి పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో గ్యాంగ్స్టర్ కాల్చి చంపబడ్డాడు. కాల్పుల్లో తలకు గాయాలు అయిన ఒక పోలీసు అధికారి కూడా తాజాగా చికిత్స పొందుతూ మరణించాడు. ప్రభుత్వ వైద్య కళాశాల (జిఎంసి) ఆసుపత్రి సమీపంలో రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మరణించిన పోలీసును ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్ దీపక్ శర్మగా గుర్తించారు.
ఎన్కౌంటర్లో ప్రత్యేక పోలీసు అధికారి కూడా గాయపడ్డాడు. రాంఘర్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసులో కీలక నిందితుడైన గ్యాంగ్స్టర్ వాసుదేవ్ను ఒక పక్కా సమాచారం మేరకు అధికారుల బృందం వెంబడించిందని, ఇది ఆసుపత్రి సమీపంలో ఎదురుకాల్పులకు దారితీసిందని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఎన్కౌంటర్లో వాసుదేవ్ మరణించగా, అతని సహచరుడు ఒకరు గాయపడ్డారు.