Maha Kumbh: 300 కిలోమీటర్ల ట్రాఫిక్‌ జామ్‌

ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ - మహాకుంభమేళాలో మరో రికార్డు !;

Update: 2025-02-11 00:15 GMT

మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే దారులన్నీ తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌తో నిండిపోతున్నాయి. 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 200 కి.మీ దూరం నుంచి ప్రయాగ్‌రాజ్‌ రావడానికి తమకు 16 గంటలు పట్టిందని ఒక కుటుంబం వాపోయింది. నడక దారులు కూడా కిక్కిరిసిపోవడంతో 4 కి.మీ దూరానికి నాలుగు గంటలు పడుతున్నదని పలువురు భక్తులు వాపోయారు. రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో నగరానికి దారితీసే అన్ని దారులు ట్రాఫిక్‌ జామ్‌తో స్తంభించిపోయాయి.   

సుమారు 48 గంటలుగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నామని, 50 కిలోమీటర్లు వెళ్లేందుకు దాదాపు 12 గంటల సమయం పడతుందని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల రద్దీని నియంత్రించలేని కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రయాగ్‌రాజ్‌ సంగం రైల్వేస్టేషన్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్లు వదంతులు వెలువడ్డాయి. అయితే అవి అసత్య వార్తలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కొట్టిపారేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని ఎనిమిది రైల్వేస్టేషన్లు సజావుగా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ల నుంచి ఆదివారం 330 రైళ్లు బయలుదేరినట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తుల వాహనాల కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌జాం అయింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ మరో రెండు రోజులు ప్రయాగ్‌రాజ్‌ యాత్ర వాయిదా వేసుకోవాలని కుంభమేళాకు వెళ్లే భక్తులకు విజ్ఞప్తి చేశారు.

'భక్తులూ మనుషులే- కనికరించండి!'

ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే మార్గాల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కార్‌పై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాహాకుంభమేళా ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ట్రాఫిక్‌జాం కారణంగా రహదారులపై చిక్కుకున్న లక్షలాది మంది భక్తులు ఆకలి, దాహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గంటగంటకు ట్రాఫిక్‌ రద్దీ పెరగుతుండడం వల్ల భక్తులు ఆహారం, విశ్రాంతి లేక నీరసించిపోతున్నారని పేర్కొన్నారు. సామాన్య భక్తులూ మనుషులే అనీ మానవతా దృక్పథంలో వాళ్లకీ అత్యవసర ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు కాశీ, అయోధ్యలను కూడా దర్శించుకుంటుండటంతో ఈ రెండు ప్రాంతాలు లక్షలాది మంది భక్తులతో నిండిపోతున్నాయి.

Tags:    

Similar News