Indira Gandhi : ఫరీద్కోట్ స్థానం నుంచి పోటీ చేయనున్న ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుడు సరబ్జిత్ సింగ్ (45) పంజాబ్లోని ఫరీద్కోట్ నియోజకవర్గం నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. సరబ్జిత్ సింగ్ ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడు.
బియాంత్ సింగ్, సత్వంత్ సింగ్తో కలిసి 1984 అక్టోబర్ 31న ఆమె నివాసంలో కాల్చి చంపారు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఫరీద్కోట్లోని పలువురు విజ్ఞప్తి చేయడంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సరబ్జిత్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానానికి తమ అభ్యర్థిగా కరమ్జిత్ అన్మోల్ను ప్రతిపాదించింది. కరమ్జిత్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు సన్నిహితుడు.
2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముహమ్మద్ సాదిక్ ఈ స్థానంలో గెలుపొందారు. 2014లో శిరోమణి అకాలీదళ్, 2009లో పరమ్జిత్ కౌర్ గుల్షన్ శిరోమణి అకాలీదళ్ తరఫున గెలుపొందారు. అంతకు ముందు 2004లో ఇక్కడి నుంచి శిరోమణి అకాలీదళ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎంపీగా ఎన్నికయ్యారు.
సరబ్జిత్ సింగ్ 2004లో బటిండా నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి 1.13 లక్షల ఓట్లతో విఫలమయ్యారు. అతను 2007లో పంజాబ్ శాసనసభ ఎన్నికలలో బదౌర్ స్థానం నుండి పోటీ చేసినప్పటికీ ఓటమిని ఎదుర్కొన్నాడు. 2014 లోక్సభ ఎన్నికల్లో ఫతేఘర్ సాహిబ్ స్థానం నుంచి సరబ్జిత్ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ మళ్లీ ఓడిపోయాడు. కాగా అతని తల్లి బిమల్ కౌర్ 1989లో రోపర్ స్థానం నుండి ఎంపీగా ఎన్నికయ్యారు. పంజాబ్లోని 13 లోక్సభ స్థానాలకు జూన్ 1వ తేదీన ఓటింగ్ జరగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఫరీద్కోట్ లోక్సభ స్థానం నుండి నటుడు కరమ్జిత్ అన్మోల్ను బరిలోకి దించగా, బీజేపీ.. గాయకుడు హన్స్ రాజ్ హన్స్ను తమ అభ్యర్థిగా ప్రతిపాదించింది.