Karnataka: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు, కర్ణాటక కేబినెట్ ఆమోదం

మహిళల ఆరోగ్యం, శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం

Update: 2025-10-10 02:15 GMT

మహిళా ఉద్యోగుల సంక్షేమం దిశగా కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక అడుగు ముందుకేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రతి నెలా ఒక రోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

ఈ కొత్త విధానం ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలతో పాటు టెక్స్‌టైల్, ఐటీ, బహుళజాతి కంపెనీలు సహా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు సంస్థల్లోని మహిళా సిబ్బందికి వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వారికి మద్దతుగా నిలుస్తూ, ప్రోత్సాహకరమైన పని వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని పేర్కొంది. మహిళల శారీరక, మానసిక ఆరోగ్యంపై సమాజంలో అవగాహన పెంచేందుకు కూడా ఇది దోహదపడుతుందని వివరించింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది మహిళలు ప్రయోజనం పొందుతారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే దేశంలోని బిహార్, కేరళ, ఒడిశా, సిక్కిం వంటి రాష్ట్రాలు మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో కర్ణాటక కూడా చేరింది. ప్రభుత్వాలే కాకుండా, జొమాటో, స్విగ్గీ, ఎల్ అండ్ టీ వంటి కొన్ని ప్రైవేటు సంస్థలు సైతం ఇప్పటికే తమ మహిళా ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అయితే సంఘటిత రంగంలో ఈ మార్పులు వస్తున్నప్పటికీ, అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు ఇలాంటి సౌకర్యాలు కల్పించడం ఇప్పటికీ ఒక సవాలుగానే ఉందని మహిళా హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.

Tags:    

Similar News