కేరళ పేరును మార్చుతూ పినరయి విజయన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రాన్ని కేరళంగా పిలవాలని తీర్మానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభ సోమవారం ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.
ఆ తీర్మానాన్ని ముఖ్యమంత్రి పినరయి సభలో ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో ఏకగ్రీవ ఆమోదం లభించినట్లయింది. అయితే ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్షాలు కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. గతేడాది ఆగస్టు 9వ తేదీన కూడా కేరళ పేరును కేరళంగా మార్చాలని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
రాజ్యాంగంలో ఈ విషయాన్ని మొదటి షెడ్యూల్, ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరింది. అయితే ఈ డిమాండ్ ను కేంద్రం తోసిపుచ్చింది. ఇప్పుడు మరోసారి రాజ్యాంగంలోని ఎనిమిదో జాబితాలో పేరు మార్పు విషయాన్ని చేర్చాలనే తీర్మానాన్ని కేంద్రానికి పంపడం జరిగింది.