Social Media Post : దేశంలో 3వారాలు లాక్డౌన్.. సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తి అరెస్ట్
వచ్చే లోక్సభ ఎన్నికల (Lok Sabha) కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఈవీఎంలు) ట్యాంపర్ చేసేందుకు దేశవ్యాప్తంగా మూడు వారాల పాటు లాక్డౌన్ విధిస్తామంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు ఒక వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని రాష్ట్రంలోని మలప్పురం జిల్లాకు చెందిన ఎంవీ షరాఫుద్దీన్గా గుర్తించినట్లు రాష్ట్ర పోలీసు మీడియా సెల్ శుక్రవారం (మార్చి 29) ఒక ప్రకటనలో తెలిపింది.
షరాఫుద్దీన్ తన ప్రచారంలో భాగంగా COVID లాక్డౌన్ సమయంలో ప్రచురించబడిన వార్తా కథనానికి సంబంధించిన స్క్రీన్షాట్ను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేరళ పోలీసుల కొచ్చి సైబర్డోమ్ బ్రాంచ్ నిర్వహించిన సోషల్ మీడియా పెట్రోలింగ్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వచ్చే లోక్సభను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేసేవారిని, ప్రచారం చేస్తున్న వారిని గుర్తించేందుకు సైబర్ విభాగం నేతృత్వంలో సైబర్ పోలీస్ హెడ్క్వార్టర్స్, అన్ని రేంజ్లు, అన్ని పోలీసు జిల్లాల్లో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్లను ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది.