Rahul Gandhi : పోటీలో లేని ప్రియాంక.. రాయ్బరేలిలో రాహుల్కు పోటీ ఎవరో తెలుసా?
తోబుట్టువులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఉత్తర్ ప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు బరిలో దిగుతారనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. తాజాగా ఈ రెండు స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. రాయ్బరేలి స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో దిగుతున్నారు. అమేథీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు అయిన కిశోరీ లాల్ శర్మను కాంగ్రెస్ అధిష్టానం బరిలోకి దించుతోంది. ఈ రెండు స్థానాల్లో నామినేషన్ల దాఖలుకి గడువు శుక్రవారంతో ముగియనుంది.
చివరి క్షణంలో అభ్యర్థులను ప్రకటించింది ఏఐసీసీ. కొద్ది రోజులుగా ఈ రెండు స్థానాల నుంచి రాహుల్గాంధీ, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ప్రియాంక గాంధీ రాయ్బరేలి నుంచి పోటీ చేస్తారని అనుకున్నా.. ఆమె ఈసారి లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. రాయ్బరేలి నుంచి రాహుల్గాంధీ పేరును ఏఐసీసీ నిర్ణయించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీలో ఉన్నారు. ఇప్పుడు రాయ్బరేలి కూడా కన్ఫామ్ కావడంతో రెండు లోక్సభ స్థానాల నుంచి రాహుల్ పోటీ చేస్తున్నట్లు అయ్యింది. రాయ్బరేలిలో రాహుల్గాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ తరఫున దినేశ్ ప్రతాప్ సింగ్ పేరును అధిష్టానం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్సీ అయిన దినేశ్ ప్రతాప్సింగ్ దేశ ప్రజలకు పెద్దగా తెలియదు కానీ.. ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు మాత్రం బాగానే తెలుసు. ఆయన 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి చెందారు. దినేశ్ ప్రతాప్ సింగ్ బలమైన పోటీ ఇస్తారని... గెలిచినా అశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్థానికులు చెబుతున్నారు.