కాంగ్రెస్ (Congress) సుప్రీమ్, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో న్యాయ్ యాత్ర కు ఐదురోజుల బ్రేక్ పడింది. రాహుల్ గాంధీ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో యాత్రకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకూ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ ఈనెల 27, 28 తేదీల్లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. దేశంలో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో పలు ముఖ్య సమావేశాల్లో కూడా రాహుల్ పాల్గొంటారు. అందుకే యాత్రకు ఐదు రోజుల పాటు తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్లు జైరాం రమేశ్ తెలిపారు.
యాత్రను మార్చి 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ధోల్పూర్లో తిరిగి ప్రారంభిస్తారు. మార్చి 5వ తేదీన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ సందర్శించనున్నారు.