దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఇవాళ 13 రాష్ట్రాల్లో 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 1.67 లక్షల కేంద్రాల్లో 15.9 కోట్ల మంది ఓటర్లు 1,202 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 8.08 కోట్లు పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. వీరిలో 34.8 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో దశలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్లోని బైతూల్లో బీఎస్పీ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ను ఈసీ మే 7కు వాయిదా వేసింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ (వయనాడ్) ఈ దశలోనే బరిలో ఉన్నారు. 2014 నుంచి మథురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమామాలిని.. ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు. హ్యాట్రిక్ విజయాల కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (కోటా-బూందీ), కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (జోధ్పుర్) ప్రయత్నిస్తున్నారు.
ఛత్తీస్గఢ్లో 30 ఏళ్లుగా భాజపాకు కంచుకోటగా ఉన్న రాజ్నంద్గావ్ స్థానంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేశ్ బఘేల్ బరిలో దిగారు. కాంగ్రెస్ నేత శశిథరూర్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తలపడుతోన్న తిరువనంతపురంలోనూ నేడే పోలింగ్ జరుగుతోంది. వీరితో పాటు భాజపా తరఫున అరుణ్ గోవిల్ (మేరఠ్), తేజస్వీ సూర్య (బెంగళూరు దక్షిణం) బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ (అలప్పుళ) భవితవ్యాన్ని ఓటర్లు ఈరోజే నిక్షిప్తం చేయనున్నారు.