వందేభారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ రైళ్లను త్వరలోనే పట్టాలు ఎక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వెర్షన్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆవిష్కరించారు. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫెసిలిటీలో వీటిని ప్రారంభించారు. బీఎమ్ఈఎల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వందే భారత్ తయారీ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ‘ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత, వందే భారత్ స్లీపర్ కోసం చాలా శ్రమించాం. వీటి తయారీ ఇప్పుడే పూర్తయింది. పది రోజుల పాటు వీటిపై కఠినమైన ట్రయల్స్, టెస్ట్లు నిర్వహించనున్నాం’’ అని వైష్ణవ్ చెప్పారు. రానున్న మూడు నెలల్లో ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.