Supreme Court : రాష్ట్రాలకు అధికారం ఉంటుంది... ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం సంచలన తీర్పు
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది. 6:1తో సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. జస్టిస్ బేలా త్రివేది మాత్రం వర్గీకరణను వ్యతిరేకించారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.
అసలు ఏం జరిగిందంటే..?
వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను హైకోర్టు 2010లో కొట్టేసింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని.. దీనిపై పునస్సమీక్షించాలని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది.
వర్గీకరణతోనే సామాజిక న్యాయం : కేంద్రం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడురోజుల పాటు విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు చెప్పింది. ఎట్టకేలకు 5నెలల తర్వాత గురువారం తీర్పును వెల్లడించింది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని కేంద్రం వాదించింది. ‘ వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుంది. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యం. రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుంది’ అని కేంద్రం వాదించింది.