జాతీయ రహదారులపై మళ్లీ టోల్ చార్జీలు పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెరిగే టోల్ చార్జీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెంపు వాయిదా పడింది. పెరిగిన టోల్ చార్జీలు జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని బీవోటీ పద్ధతిలో విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు జీఎంఆర్ సంస్థ సిద్ధమైంది. జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు వద్ద ఒక్కొక్కటి చొప్పున మూడు టోల్ ప్లాజాలను జీఎమ్మార్ సంస్థ ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 2012 నుంచి టోల్ ఫీజు వసూళ్లను కాంట్రాక్టు సంస్థ ప్రారంభించింది.
నేషనల్ హైవే అథారిటీ నిబంధనల మేరకు ప్రతిఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ఫీ జు ధరలను పెంచుకునే వెసులుబాటు జీఎమ్మార్ సంస్థకు NHAI కల్పించింది. అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టోల్ చార్జీల పెంపును ఎన్నికల సంఘం వాయిదా వేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. జూన్ 1న అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ ధరలు అమల్లోకి వస్తాయి.