కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధ ( Rahul Gandhi ) జూన్ 12న కేరళలోని వాయనాడ్ లో ( Wayanad ) పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్ సభ ఎన్నికల్లో వాయనాడ్ నియోజక వర్గంలో భారీ విజయం సాధించిన నేపథ్యంలో, రాహుల్ నియోజకవర్గానికి వెళ్లబోతున్నారు. రాయబరేలీలో విజయం సాధించిన రాహుల్, వయనాడ్ స్థానాన్ని విడిచి పెడతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో రాహుల్ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ లో తొలుత పోటీచేసిన రాహుల్ తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి అన్నీ రాజాపై 3,64,422 ఓట్ల తేడా విజయం సాధించారు. రాహుల్ పర్యటన షెడ్యూల్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రకటించిన రాష్ట్ర అసెంబ్లీకి నిరసన ప్రదర్శన వాయిదా వేసినట్లు ఆపార్టీ తెలిపింది. లిక్కర్ పాలసీ వివాదంపై పినరయి విజయన్ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రతిపక్ష ఫ్రంట్ గత నెలలో నిరసన ప్రదర్శనను ప్రకటించింది. బార్ యజమానులకు అనుకూలంగా రాష్ట్ర మద్యం పాలసీని సవరించాలని వామపక్షాల ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోందని ప్రతిపక్షం తీవ్రంగా ఆరోపిస్తోంది.
టూరిజం, ఎక్సైజ్ మంత్రులు రాజీనామా చేయాలని యూడీఎఫ్ డిమాండ్ చేసింది. నిరసనను తీవ్రతరం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించింది. రాహుల్ గాంధీ వయనాడ్ పర్యటనకు సంబంధించి ఫ్రంట్ నేతలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున జూన్ 12న జరగాల్సిన యూడీఎఫ్ మార్చ్, సమన్వయ కమిటీ సమావేశం రెండూ వాయిదా వేశారు.