మాజీ మంత్రి, BRS నేత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసులో ఆయనను అరెస్టు చేయద్దని ఆదేశించింది. అయితే పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని, దీనికి హరీష్ రావు సహకరించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కాగా, తన ఫోన్ ట్యాప్ చేయించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్, హరీష్ రావుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ప్రశ్నిస్తే కేసులు.. అరెస్టులు: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. పాలనలో లోపాలను గుర్తు చేసినా, గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలించినా.. ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరించినా కేసులు పెడుతున్నారు. సూట్కేసులు మీకు.. అరెస్టులు మాకా" అంటూ ఎద్దేవా చేశారు.