JAGAN: కోడికత్తి కేసులో హైకోర్టులో జగన్ పిటిషన్
ఎన్ఐఏ కోర్టు పిటిషన్ కొట్టేయడంతో హైకోర్టుకు ఏపీ సీఎం... నేడు విచారణ;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో దాడి ఘటన కేసులో లోతైన దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను ఎన్ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ జగన్మోహన్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్కు నంబరు కేటాయించే దశలో రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తడంతో ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి వద్ద ఇవాళ(శుక్రవారం) విచారణ జరగనుంది. కోడికత్తితో తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని, లోతైన దర్యాప్తు జరపాలని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్ఐఏ అభియోగపత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. నిందితుడు శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా క్యాంటిన్ నిర్వాహకుడు విధుల్లోకి తీసుకున్నారన్నారు. కుట్ర కోణం తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఎన్ఐఏ కోర్టు జులై 25న ఈ పిటిషన్ను కొట్టివేయడంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు.