LOKESH DEEKSHA: ఢిల్లీలో లోకేశ్ నిరాహార దీక్ష
చంద్రబాబు, భువనేశ్వరి దీక్షలకు మద్దతుగా లోకేశ్ దీక్ష... పాల్గొన్న టీడీపీ ఎంపీలు...
రాజమండ్రి జైల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఢిల్లీలో నారా లోకేష్ ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్కు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబు, భువనేశ్వరీల దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో యువనేత నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్న లోకేశ్... అరాచకాలను నిరసిస్తూ దీక్ష చేసి చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్నానని తెలిపారు. సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాలరాశారని, సత్యాన్ని వధించారని మండిపడ్డారు.