OLYMPICS: విశ్వక్రీడల్లో ఒలింపిక్స్
లాస్ ఏంజెల్స్ 2028లో క్రికెట్ కు ఆమోదం.. 128 ఏళ్ల తర్వాత విశ్వక్రీడల్లో క్రికెట్.. టీ 20 ఫార్మాట్ లో జరగనున్న మ్యాచులు;
ఒలింపిక్స్ అంటే క్రీడల మహా కుంభమేళా. ఏళ్ల తరబడి కఠోర సాధన చేసిన అథ్లెట్లు... తమ పతక కలను సాకారం చేసుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసే వేదిక. ఒలింపిక్స్ లో ఒక్క పతకం నెగ్గినా చిరకాల స్వప్నం నెరవేరినట్లే. ఈ విశ్వ క్రీడా వేదికపై ఒక్కసారి పతకం గెలిచి.. దేశ కీర్తి పతాకను రెపరెపలాడించాలని అథ్లెట్లు నిరంతరం శ్రమిస్తుంటారు. అంతటి ప్రతిష్టాత్మక వేదికలో.. శతాబ్దకాలం తర్వాత క్రికెట్ మళ్లీ రంగ ప్రవేశం చేయనుంది. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ లో మళ్లీ క్రికెట్ సందడి చేయనుంది. దాదాపు 128 ఏళ్ల తరువాత క్రికెట్ కు.. మళ్లీ ఒలింపిక్స్ లో స్థానం లభించింది.
క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే వార్త. క్రికెట్ ను ఎట్టకేలకు ఒలింపిక్స్లో మళ్లీ చూడబోతున్నాం. దాదాపు 128 ఏళ్ల తర్వాత లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్లో క్రికెట్ భాగం కానుంది. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్లో క్రికెట్ సహా కొత్తగా ఆరు క్రీడలను పోటీల్లో చేర్చేందుకు ఆమోదం తెలిపారు. ఈసారి మొత్తం 351 మెడల్ ఈవెంట్లు నిర్వహించాలని నిర్ణయించారు. క్రికెట్లో ఆరు జట్లు పోటీల్లో పాల్గొననున్నట్లు బోర్డు నిర్ణయించింది. పురుషులు, మహిళల విభాగాల్లో ఆరు చొప్పున జట్లతో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ లో క్రికెట్ టీ 20 ఫార్మట్లో జరగనుంది. ఐసీసీ ఫుల్ మెంబర్స్గా ఉన్న 12 జట్లతో సహా దాదాపు 100 దేశాల నుంచి జట్లను ఎంపిక చేసి మ్యాచులు నిర్వహించనున్నారు. క్రికెట్ పోటీలకు వేదికలు, షెడ్యూల్ ఫైనల్ కాలేదు. క్వాలిఫికేషన్ ప్రక్రియను కూడా ఇంకా నిర్ణయించలేదు.
అలా అయితే పాక్ కు కష్టమే..
ఒలింపిక్స్ లో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం జట్ల ఎంపిక ప్రక్రియ ఉంటుందని క్రికెట్ ప్రపంచంలో విస్తృత ప్రచారం సాగుతోంది. ఈ లెక్కన ప్రస్తుతం భారత్ ఆగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా రెండో ప్లేస్లో కొనసాగుతోంది. ఈ లిస్ట్లో పాకిస్థాన్ ఏడో స్థానంలో ఉంది. టాప్ 6 జట్లను ఎంపిక చేస్తే పాక్ ఒలింపిక్స్కు అర్హత సాధించడం అనుమానంగా కనిపిస్తోంది. మహిళల ర్యాంకింగ్స్లోనూ పాక్ది ఇదే పరిస్థితి. పాకిస్థాన్ ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది.