T20 WORLD CUP: పాక్పై అమెరికా "సూపర్" విజయం
టీ 20 ప్రపంచకప్లో పెను సంచలనం... ఒత్తిడికి చిత్తయిన పాకిస్థాన్;
టీ 20 ప్రపంచకప్లో పెను సంచలనం నమోదైంది. మాజీ ఛాంపియన్ పాకిస్థాన్కు ఆతిథ్య అమెరికా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాక్ జట్టును అమెరికా సూపర్ ఓవర్ వరకూ పోరాడి మట్టికరిపించింది. గ్రూప్ ఏలో భాగంగా డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ 25 బంతుల్లో 40, కెప్టెన్ బాబర్ అజామ్ 43 బంతుల్లో 44 పరుగులతో రాణించారు. ఇప్తికార్ అహ్మద్ (18), షాహీన్ అఫ్రిది (23) పరుగులు చేయగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అమెరికా బౌలర్లలో కెంజిగే 3, నేత్రవల్కర్ 2, అలీ ఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. దీంతో పాక్ పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 1సరిగ్గా 59 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. అమెరికా ఓపెనర్ స్టీవెన్ టేలర్ (12) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరినా.. కెప్టెన్ మోనాంక్ పటేల్ (50; 38 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), వన్డౌన్ బ్యాటర్ ఆండ్రీస్ గౌస్ (35; 26 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఆరోన్ జోన్స్ (25; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), నితీశ్ కుమార్ (14; 14 బంతుల్లో) రాణించారు. చివరి ఓవర్లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరం కాగా.. మొదటి ఐదు బంతుల్లో నాలుగు సింగిల్స్, ఓ సిక్స్ వచ్చాయి. చివరి బంతికి నితీశ్ ఫోర్ బాదడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. పాక్ బౌలర్లలో మహ్మద్ అమిర్, నసీమ్ షా, హరిస్ రవూఫ్ తలో వికెట్ పడగొట్టారు.
సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. అనంతరం 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్... కేవలం 13 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆరు పరుగుల తేడాతో పాక్పై గెలిచి అమెరికా చరిత్ర సృష్టించింది.