PV Sindhu సెమీస్ పోరులో సింధు ఓటమి..
టోక్యో ఒలింపిక్స్ లో తెలుగమ్మాయి సింధు సెమీస్ పోరాటం ముగిసింది.;
ఒలిపింక్స్ బ్యాడ్మింటన్ మహిళ సింగిల్స్ సెమీస్లో తెలుగు తేజం పీవీ సింధు ఓటమి పాలైంది. తైపే క్రీడాకారిణి తైజు చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలైంది. అయితే ప్రత్యర్థితో హోరాహోరీగా పోరాడి ఆకట్టుకుంది. తొలిసెట్లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. సింధు, తైజు నువ్వా నేనా అన్నట్లు పాయింట్లు సాధించారు. అయితే చివర్లో తైజు పుంజుకుని 21-18 తో సెట్ను కైవసం చేసుకుంది. ఇక రెండోసెట్లో సింధుపై తైజు పూర్తిస్థాయి ఆధిపత్యం కనబర్చింది. సింధు కూడా గట్టిగానే పోరాడినా... తైజు చురుకైన షాట్లకు ఆమె దగ్గర సమాధానం లేకుండా పోయింది. అద్భుతమైన రీతిలో ఆడుతూ... సింధును ముప్పు తిప్పలు పెట్టింది. రెండో సెట్ను 21-12 తేడాతో కైవసం చేసుకున్న తైజు.. ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే సింధుకు ఇంకా పతకంపై ఆశలు మిగిలే ఉన్నాయి. మరో సెమీస్లో ఓటమిపాలైన క్రీడాకారిణితో కాంస్యం కోసం సింధు తలపడనుంది.