T20 WORLD CUP: ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్..!
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్
వచ్చే ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి షెడ్యూలు ఇంకా ఖరారు కాకపోయినా ఈ టోర్నీకి సంబంధించిన మ్యాచ్లు భారత్లోని 5 స్టేడియాలతో పాటు శ్రీలంకలోని రెండు గ్రౌండ్లలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ తమ అన్నీ మ్యాచ్లను శ్రీలంకలో ఆడనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీ పడనున్నాయి. అన్ని జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. ఆ తర్వాత సూపర్ 8 దశ, సెమీఫైనల్స్, ఫైనల్ ఉంటాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ అహ్మదాబాద్ లేదా కొలోంబోలో జరిగే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ జట్టు టీ20 వరల్డ్కప్ ఫైనల్కు అర్హత సాధిస్తే… తుది సమరం కొలంబోలో జరుగుతుంది. లీగ్ దశలోనే దాయాది జట్టు ఇంటికి వెళ్తే.. ఫైనల్ పోరు అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక, డిఫెండింగ్ చాంపియన్ భారత్తో పాటు శ్రీలంక, అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ జట్లు ఇప్పటికే టీ20 ప్రపంచకప్నకు అర్హత సాధించాయి. ఈ మ్యాచుల కోసం ఏర్పాటు పూర్తయ్యాయి.
ఇందులో ఇటలీ జట్టు మొట్టమొదటిసారి ప్రపంచకప్కు అర్హత సాధించింది. ఇక మిగిలిన ఐదు స్థానాల కోసం క్వాలిఫయింగ్ టోర్నీలు జరిగే అవకాశం ఉంది. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి 2 జట్లు, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో 3 టీమ్స్ ఈ టోర్నీకి అర్హత సాధించే ఛాన్స్ ఉంది. 2024లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఇచ్చిన ఆతిథ్యంలో జరిగిన టీ20 ప్రపంచకప్ను రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోని ఇండియా - పాక్ కెప్టెన్లు
ఆసియా కప్ 2025 టోర్నీలో కెప్టెన్ల ప్రెస్ మీట్ చర్చకు దారి తీసింది. ఈ మీట్లో టోర్నీలో పాల్గొంటున్న 8 జట్ల కెప్టెన్లు పాల్గొని, ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆఫ్ఘాన్ కెప్టెన్ రషీద్ ఖాన్తో చాలా స్నేహంగా ఉంటూ, చాలా సేపు మాట్లాడిన భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్తో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. కెప్టెన్స్ మీట్లో కెప్టెన్లు అందరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. అయితే భారత సారథి, పాక్ సారథితో హ్యాండ్ షేక్స్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఒకానొక సమయంలో యుద్ధ వాతావరణం నెలకొని, ఐపీఎల్ 2025 టోర్నీకి మధ్యలో వారానికి పైగా గ్యాప్ వచ్చింది.