IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్.. టాప్ 4 ఆటగాళ్లకు ఎందుకంత ధర..?
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 ఆక్షన్లో అందరికంటే ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్.;
IPL 2022 Auction: ఈసారి ఐపీఎల్ ఆక్షన్ ఎన్నో ట్విస్టులతో ముగిసింది. ఇదివరకు జరిగిన ఆక్షన్స్కంటే ఇది కాస్త భిన్నంగా జరిగింది. ఎందుకంటే చాలావరకు సీనియర్ ఆటగాళ్లకు ఇందులో ఊహించనంత వేలం జరగలేదు. కొందరు సీనియర్ ఆటగాళ్లను అయితే టీమ్స్ పక్కన పెట్టేశాయి. మరి ఈ ఆక్షన్లో ఎక్కువ వేలం పలికిన వారిలో ప్లస్లు ఏంటి..? వారిని ఎందుకు అంత ధర పెట్టి టీమ్స్ దక్కించుకున్నాయి.?
ఐపీఎల్ 2022 ఆక్షన్లో అందరికంటే ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఇషాన్ కిషన్. తనకు ఏకంగా రూ.15.25 కోట్లు పెట్టి ముంబాయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఈసారి ఐపీఎల్ ఆక్షన్లో అత్యధిక ధర పలికిన హీరో ఇషాన్ కిషన్ కాగా.. మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలోనే ఎక్కువ ధర అందుకున్న ఆటగాళ్ల లిస్ట్లో రెండో స్థానంలో నిలిచాడు ఇషాన్. 23 ఏళ్ల ఇషాన్ గత కొన్నాళ్లుగా క్రికెట్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్గా, కీపర్గా తానేంటో నిరూపించుకుంటున్నాడు.
ఇషాన్ కిషన్ తర్వాత ఐపీఎల్ 2022లో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు దీపక్ చాహర్. 2018 నుండి చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ తరపునే ఆడుతున్నాడు. ఇప్పుడు కూడా అదే టీమ్ తనను రూ.14 కోట్లకు దక్కించుకుంది. చాహర్ బౌలర్గా పవర్ప్లేలో వికెట్లు తీయడంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంలో కూడా స్పెషలిస్ట్.
మెగా ఆక్షన్లో ఈసారి మూడో ప్లేస్లో ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. ఒకప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా రాణించిన శ్రేయస్.. ఇప్పుడు కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడనున్నాడు. తనను ఈ టీమ్ రూ.12.25 కోట్లు పెట్టి దక్కించుకుంది. గాయం కారణంగా కెప్టెన్సీకి దూరమయ్యాడు శ్రేయస్. కానీ కెప్టెన్గా తనకున్న అనుభవంతో, బ్యాట్స్మన్గా తనకున్న టాలెంట్తో టీమ్కు విక్టరీ తెచ్చిపెడతాడని కోల్కతా నైట్ రైడర్స్ భావిస్తోంది.
ఇప్పటివరకు ఆక్షన్లో టీమిండియాకు సంబంధించిన ఆటగాళ్లకు మాత్రమే ఎక్కువ ధర పలకగా నాలుగో స్థానంలో మాత్రం ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ ఈ విదేశీ ఆటగాడిని ఏకంగా రూ. 11.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ టీమ్లో ఉన్న స్ట్రాంగ్ ఆల్రౌండర్లలో లియామ్ లివింగ్స్టోన్ కూడా ఒకడు.