Usain Bolt: ఢిల్లీ వీధుల్లో జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్
భారత పర్యటనలో స్ప్రింట్ రారాజు బోల్ట్.. ఢిల్లీ వీధుల్లో పర్యటించిన ఉసేన్ బోల్ట్
దేశ రాజధాని నగరంలో ‘జమైకన్ చిరుత’ ఉసేన్ బోల్ట్ సందడి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఈ స్ప్రింటర్ కోసం ఢిల్లీ కాసేపు అథ్లెటిక్ రన్నింగ్ ట్రాక్గా మారింది. ఆసియాలోనే అతిపెద్ద మసాలా దినుసుల మార్కెట్ అయిన ఢిల్లీ ‘ఖరి బౌలీ’లో స్ప్రింట్ దిగ్గజం బోల్ట్ భారత ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, పీఆర్ శ్రీజేశ్, జాతీయ 200 మీటర్ల అథ్లెటిక్స్ చాంపియన్ అనిమేశ్ కుజుర్లతో కలిసి అభిమానుల్ని ఉత్సాహపరిచాడు. ప్రముఖ విదేశీ అపారల్, స్పోర్ట్స్ కిట్ ఉత్పాదక సంస్థ ‘ప్యుమా’ ఏర్పాటు చేసిన ఈ ప్రచార కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగింది. ఢిల్లీ సుప్రసిద్ధ మార్కెట్ ‘ఖరి బౌలీ’ టెర్రస్ (రూఫ్ టాప్)పై ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్పై బోల్ట్ సరదాగా పరుగు పెట్టాడు. సరదాగా పరుగు పెడుతూ సందడి చేశాడు.
క్రికెటర్ల నుంచి స్ఫూర్తి పొందా: బోల్ట్
ట్రాక్లో సత్తా చాటేందుకు క్రికెటే తనకు స్ఫూర్తినిచ్చిందని జమైకా దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ అన్నాడు. భారత్ పర్యటనలో భాగంగా ముంబయిలోని జమ్నాబాయి నర్సీ ప్రాంగణానికి వచ్చిన సందర్భంగా బోల్ట్ ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తూనే పెరిగా. ఈ ఆటలో ఎదిగేందుకు క్రికెటర్లు పడే కష్టమే స్ఫూర్తినిచ్చింది. వారిలాగే శ్రమించి అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలనుకున్నా. పరుగు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ రంగంలో సత్తా చాటాలనే లక్ష్యంతో కఠోరంగా శ్రమించా. ప్రపంచ నంబర్వన్ అథ్లెట్ కావడం.. ఆ స్థాయిని నిలబెట్టుకోవడం తేలికేం కాదు. ఇందుకోసం ఎన్నో అడ్డంకులు అధిగమించా. గాయాలను ఎదుర్కొన్నా’’ అని బోల్ట్ అన్నాడు. మైకెల్ హోల్డింగ్, కోట్నీ వాల్ష్, క్రిస్ గేల్ వంటి పలువురు ప్రఖ్యాత క్రికెటర్లు కూడా జమైకన్లే కాగా... వారి ప్రభావం తనపై అధికంగా ఉన్నట్లు బోల్ట్ పేర్కొన్నాడు. విజయానికి దగ్గరి దారులు ఉండవన్న బోల్ట్ కష్టపడితే తప్పక ఫలితం వస్తుందని అన్నాడు. ‘ బోల్ట్.. ఒలింపిక్స్లో ఎనిమిది, ప్రపంచ ఛాంపియన్షిప్లో పదకొండు స్వర్ణాలు నెగ్గాడు.