WPL: ఢిల్లీని గెలిపించిన తెలుగమ్మాయి
చివరి బంతికి గెలిపించిన అరుంధతి రెడ్డి... పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్;
మహిళల ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 2 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. చివరి బంతికి తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి (2 నాటౌట్) రెండు పరుగులు సాధించడంతో ఢిల్లీ.. 2 వికెట్లతో గెలుపొందింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన DC చివరి బంతి వరకు పోరాడి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. షెఫాలీ వర్మ 43 పరుగులు చేయగా.. నిక్కీ ప్రసాద్ (35), బ్రైస్(21) రాధా యాదవ్ (9) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 164 పరుగులకు ఆలౌటైంది.
కుప్పకూలిన ముంబై
తొలుత ముంబై ఇండియన్స్ 165 పరుగుల సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. అన్నబెల్ సదర్లాండ్(3/34), శిఖా పాండే(2/14) అద్భుతమైన బౌలింగ్కు కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తోడవడంతో ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 164 పరుగులకు కుప్పకూలింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో సదర్లాండ్ 3 వికెట్లు తీయగా.. శిఖా పాండే 2 వికెట్లు పడగొట్టింది. వన్ డౌన్ బ్యాటర్ నాట్ స్కివర్ బ్రంట్ అజేయ అర్థ సెంచరీ (59 బంతుల్లో 80 నాటౌట్, 13 ఫోర్లు)తో సత్తా చాటింది. అనంతరం ఛేదనను సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 165 పరుగులు చేసి ఢిల్లీ పూర్తి చేసింది. విధ్వంసక ఓపెనర్ షెఫాలీ వర్మ (18 బంతుల్లో 43, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచింది. హీలీ మాథ్యూస్, అమేలియా కెర్ కు రెండేసి వికెట్లు లభించాయి. నికీ ప్రసాద్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. డిల్లీ తరఫున ఇదే అత్యుత్తమ ఛేదన కావడం విశేషం.
హర్మన్ ప్రీత్ అరుదైన ఘనత
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనత అందుకున్నారు. టీ20ల్లో 8,000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత ప్లేయర్గా నిలిచారు. హర్మన్ కన్న ముందు స్మృతి మంధాన(8349) ఈ రికార్డును సాధించారు. ఇక భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో.. జెమిమా రోడ్రిగ్స్(5826), షఫాలీ వర్మ(4542), మిథాలీ రాజ్(4329), దీప్తి శర్మ(3889) ఉన్నారు.