తెలంగాణలో ఈసీ ఆదేశాలతో పోలీసులు తనిఖీల వేగం పెంచారు. భారీస్థాయిలో డబ్బు సీజ్ చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేయకుండా.. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్న నగదు.. మద్యం సహా ఇతరత్రా వస్తువులను సీజ్ చేస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు రూ.104.18 కోట్లను పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీల కోసం 477 ఎఫ్ఎస్టీ, 464 ఎస్ఎస్టీ బృందాలు 89 సరిహద్దు చెక్పోస్టుల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో మొత్తం రూ.63.18 కోట్ల నగదు దొరకిందని చెప్పారు. ఇక రూ.5.38 కోట్ల విలువైన మద్యం, రూ.7.12 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.21.34 కోట్ల విలువైన ఆభరణాలతో పాటు రూ.6.91 కోట్ల విలువైన ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు.