Bhatti Vikramarka : ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ : భట్టి విక్రమార్క
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ అంగన్ వాడీలో విద్యాబోధనకు ఒక టీచర్ను నియమిస్తామన్నారు. ఇక 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లను మండలానికి మూడు చొప్పున ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అంశంపై గతంలో సీఎం రేవంత్ రెడ్డి మేధావులతో చర్చించారని గుర్తు చేశారు.
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదు..
దివ్యాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. స్మితా సబర్వాల్ తన అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేశారన్నారు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని.. ఆమె చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమది ప్రజా ప్రభుత్వమని.. ప్రతీ అంశంలో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.