రాష్ట్రంలో కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రెండు రోజులుగా పెనుగోలు గుట్టలపై ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బొగత జలపాతం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దాంతో అధికారులు భోగత జలపాతం సందర్శనను ఇవాళ నిలిపివేశారు. రానున్న రెండు రోజులలో ములుగు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతో జలపాతానికి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో పర్యాటకుల రక్షణ చర్యలో భాగంగా జలపాత సందర్శిన నిలిపి వేశారు. ఏడు పాయల ఆలయం నాలుగు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. మంజీరా నది ఆలయాన్ని చుట్టుముట్టింది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దాంతో ఇవాళ కూడా ఏడుపాయల ఆలయా న్ని మూసే ఉంచారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్త డంతో ఆలయం వద్ద మంజీరా నది ఉధృతి మరింతగా పెరిగింది. మంజీరా జలాలు గర్భ గుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి.