BONALU: హైదరాబాద్‌లో ఘనంగా సాగుతున్న బోనాల సంబరాలు

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు....భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిట;

Update: 2024-07-28 05:30 GMT

హైదరాబాద్‌లో బోనాల వేడుక ఘనంగా జరుగుతోంది. ఇవాళ పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటగా మారాయి. ఈ ఏడాది లాల్ దర్వాజా 116 వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కలు సమర్పిస్తున్నారు. బోనాల కార్యక్రమం సజావుగా సాగేందుకు రాష్ట్ర పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. రెండో రోజు రంగం భవిష్యవాణి, పోతరాజుల ఆటపాటలతో ఘటాల ఊరేగింపు ఉంటుంది. 500 కు పైగా పోలీసుల బందోబస్తు, ఆలయంచుట్టు సీసీ కెమెరాల నిఘా ఉంది. బోనాల సందర్భంగా ఆలయం వద్ద 5 క్యూ లైన్ లు ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చే మహిళా భక్తులకు రెండు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. పాతబస్తీలోని ప్రధాన 23 ఆలయాల వద్ద బోనాల జాతరకు ప్రత్యేక  ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ వైన్ షాపులు తెరుచుకోవు. 24 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్ అని పోలీసులు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మందు షాపులు తెరిచినా.. లేదా రహస్యంగా ఆ ప్రాంతాల్లో మందు విక్రయించినా చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇప్పటికే హెచ్చరించారు. ఎన్నికలు అయిపోయాయి కదా.. మళ్లీ ఇప్పుడు వైన్స్ బంద్ ఏమిటనుకుంటున్నారా.. మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ సిటీలో జులై 28 ఉదయం ఆరుగంటల నుంచి 29వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

సౌత్ ఈస్ట్ జోన్‌లో చాంద్రాయణగుట్ట, బండ్లగూడ వంటి ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు మద్యం దుకాణాలు మూసివేస్తారు. సౌత్ జోన్‌లో చార్మినార్, కమాటిపుర, హుస్సేనీ ఆలం, ఫలక్‌నుమా, మొఘల్‌పురా, చత్రినాక, షాలిబండ, మీర్‌చౌక ప్రాంతాల్లో జులై 28 ఉదయం 6 గంటల నుంచి రెండు రోజులపాటు కల్లు, వైన్ షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్ లు, మద్యం విక్రయించే సంస్థలు మూసి ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఆషాఢ మాసం ప్రారంభం నుంచి నగర వ్యాప్తంగా బోనాల పండగ వైభవంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News